తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంపై జరుగుతున్న సిట్ దర్యాప్తు తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై అనేక సందేహాలు ఉన్నప్పటికీ, ఆయనను నిందితుడిగా చేర్చకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ నెయ్యి టెండర్ల కేటాయింపులో కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నా, దర్యాప్తు సంస్థ మౌనం వహించడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read : పెట్రో బాదుడుకు రంగం సిద్ధం..!
ముఖ్యంగా, ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తీసుకున్న భారీ ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళిందనే కోణంలో విచారణ సాగకపోవడం గమనార్హం. పీఏ స్థాయి వ్యక్తి ఇంతటి భారీ స్కామ్ను ఒంటరిగా నడిపించే అవకాశం లేదని, అసలైన లబ్ధిదారులను తేల్చకుండానే అధికారులు దర్యాప్తును ముగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరో విస్తుపోయే విషయం ఏమిటంటే, నిందితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు అనుమతి కోరిన సిట్ అధికారులు, ఆ ప్రక్రియను పూర్తి చేయకుండానే విచారణను ముగించడం.
Also Read : సింగపూర్లో మంత్రిగారి మసాజ్ కథలు..!
సుబ్బారెడ్డి సన్నిహితుడు మరియు మాజీ పీఏ చిన్న అప్పన్నను సిట్ ఇప్పటికే అరెస్టు చేసింది. ఆయన ద్వారానే నిందితులైన డైరీల నుండి భారీగా ముడుపులు అందాయని, ఈ గొలుసుకట్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేల్చకుండానే కేసు ముగించడంపై అనుమానాలు వస్తున్నాయి. లావాదేవీల మూలాలను వెలికితీయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారెడ్డిని కాపాడేందుకే దర్యాప్తులో ఈ నాన్చుడు ధోరణి కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

