విశాఖ వేదికగా ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై స్పష్టతనిచ్చారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఈ రైల్వే జోన్ ను నోటిఫై చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ వేదిక కాబోతోందని మంత్రి వెల్లడించారు.
Also Read : మాచర్లలో సంచలనం.. జూలకంటిపై అటాక్..!
అమరావతి నుంచి హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. ఈ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 70 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోవచ్చని తెలిపారు. అలాగే చెన్నై నుంచి అమరావతికి ప్రయాణ సమయం కేవలం 112 నిమిషాలకు తగ్గుతుందని వివరించారు. ఈ హై-స్పీడ్ కనెక్టివిటీ ఏపీ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని నమస్తే అండి.. బాగున్నారా..? అంటూ స్వచ్ఛమైన తెలుగులో ప్రారంభించి ఆకట్టుకున్నారు.
Also Read : కాళేశ్వరంపై పట్టు వదలని రేవంత్.. కీలక సమావేశం..!
డేటా హబ్ గా అవతరిస్తున్న విశాఖకు మరిన్ని శక్తులు అవసరమని, ఇకపై విశాఖపట్నాన్ని ఏఐ పట్నంగా పిలవాల్సిందేనని ఆయన చమత్కరించారు. ప్రపంచ ఐటీ మ్యాప్ లో విశాఖకు దక్కబోయే ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న నాయకుడితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం. ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు విజన్కు హ్యాట్సాఫ్ అని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటుందని, విశాఖను టెక్నాలజీ మరియు ట్రాన్స్పోర్ట్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

