ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు వేదికగా సోమవారం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆ బెంచ్ నుండి తప్పుకోవాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి గతంలో హాజరైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్ తో పాటుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. జస్టిస్ స్వర్ణకాంత శర్మ గతంలో నాలుగుసార్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన ‘అఖిల భారతీయ అధివక్త పరిషత్’ నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Also Read : వాళ్లిద్దరు కలిశారు సరే.. మరి మిగిలిన వాళ్లు..!
తాను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకిస్తానని.. అలాంటి ఐడియాలజీ ఉన్న సంస్థల వేదికలపై మీరు కనిపించారు కాబట్టి, నాకు న్యాయం జరుగుతుందా లేదా అన్న భయం నాలో ఉందని కేజ్రీవాల్ నేరుగా జడ్జిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ కేసులో కోర్టు గతంలో ఇచ్చిన కొన్ని ఆదేశాలు తనను ముందే దోషిగా నిర్ధారించినట్లు ఉన్నాయని, అందుకే ఈ బెంచ్ నుంచి తటస్థ న్యాయం ఆశించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
Also Read : క్లీన్ ఎలక్షన్ సాధ్యమేనా..?
ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ, కేజ్రీవాల్ ను ఉద్దేశించి మీరు చాలా బాగా వాదించారు, మీరు లాయర్ కూడా అవ్వొచ్చని వ్యాఖ్యానించారు. అయితే, ప్రొఫెషనల్ లీగల్ కార్యక్రమాలకు హాజరుకావడాన్ని పక్షపాతంగా చూడలేమని సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఈ విచారణ అనంతరం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

