ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేపుతోంది. గత కొన్ని రోజులుగా తన సోదరుడు, వైఎస్ జగన్, వైసీపీ ముఖ్య నేతలపై ఆమె చేస్తున్న విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు ప్రాణహాని ఉండే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి మీడియా సమావేశాల్లో.. జగన్పై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆస్తి వివాదాల ప్రస్తావన పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయనే మాట వినపడుతోంది.
Also Read : కోహ్లీ జ్వరంతో బ్యాటింగ్ చేసాడా..? అసలేం జరిగింది..?
ఈ పరిణామాల మధ్య ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక అడుగు వేశారు. తన భార్యకు తక్షణమే భద్రతను పెంచాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ఆయన లేఖ రాశారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షర్మిల బహిరంగ పర్యటనలు చేయడం రిస్క్తో కూడుకున్నదని, ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆయన ఆ లేఖలో విన్నవించినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఆమెకు ముప్పు ఉందనే సంకేతాలు అందడంతో కేంద్రం దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Also Read : వాళ్లిద్దరు కలిశారు సరే.. మరి మిగిలిన వాళ్లు..!
మరోవైపు, షర్మిలకు కేంద్రం వై కేటగిరీ భద్రతను కేటాయించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదికను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు ఉన్న భద్రతను పెంచి, 4+4 స్థాయి సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఒకవేళ కేంద్రం భద్రతను పెంచితే, అది ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన సంకేతాన్ని పంపినట్లు అవుతుంది. ఈ భద్రతా అంశం ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల మధ్య సాగుతున్న పోరుని కొత్త మలుపు తిప్పేలా కనపడుతోందనే మాట వినపడుతుంది.

