ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత కొద్దిరోజులుగా కలకలం రేపుతున్న వరుస అగ్నిప్రమాదాల మిస్టరీ వీడింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని బూడిద చేసిన ఈ ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని పనులు వేగవంతం అవుతోన్న సమయంలో.. రాయపూడి పరిధిలోని మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపుల యార్డులో ఈ నెల 23న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.21.5 కోట్ల విలువైన పైపులు దగ్ధమయ్యాయి.
Also Read : అమరావతి చట్టబద్దత.. వైసీపీ సవాల్.. ధైర్యం ఉందా..?
కేవలం ఒకే చోట కాకుండా వరుసగా అగ్నిప్రమాదాలు జరగడం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో, పైపులకు నిప్పు పెట్టినట్లు భావిస్తున్న వాచ్మెన్ రాము అలియాస్ రామ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు రామును తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించి, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా విచారించారు.
Also Read : మెగా ఫ్యామిలీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..!
విచారణలో నిందితుడు అగ్నిప్రమాదానికి తానే కారణమని అంగీకరించినట్లు సమాచారం. నిందితుడిని నేరుగా ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు, ఆ రాత్రి పైపులకు నిప్పు ఎలా పెట్టాడు..? ఏ మార్గంలో వెళ్ళాడు..? అనే అంశాలపై సీన్ రీ-క్రియేషన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ప్రమాదాలపై తీవ్రంగా స్పందించి, వీటి వెనుక రాజకీయ కుట్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక.. రాము ఒక్కడే ఈ ఘాతుకానికి ఒంటరిగా పాల్పడ్డాడా..? దీని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా..? అమరావతి పనులను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ఈ పని చేశారా..? రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా త్వరలోనే వెలుగులోకి తెస్తామని పోలీసులు చెబుతున్నారు.

