అమెరికా అధ్యక్ష ఎన్నికల భద్రతను మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన సేవ్ అమెరికా చట్టం ఆమోదం కోసం యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ఇక్కడి ఓటర్ ఐడీ వ్యవస్థను ఉదాహరణగా చూపిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక సంచలన పోస్ట్ చేసిన ట్రంప్.. ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. “అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?” అని భారత సీఈసీ జ్ఞానేష్ కుమార్ తమ యంత్రాంగాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
దేశంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల గణాంకాలను అమెరికాకు అద్దం పట్టేలా ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు. ఇండియాలో గత ఎన్నికల్లో ఏకంగా 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, వారిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్-ఇన్ ఓటింగ్ వినియోగించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు విధిగా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని కలిగి ఉన్నారని గుర్తుచేస్తూ.. అమెరికాలో కూడా ఓటింగ్ సంస్కరణలు తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : నాగబాబు.. ఇక నుంచి క్యాబినెట్ స్థాయి హోదా..!
అమెరికాలో కేవలం అమెరికన్ పౌరులు మాత్రమే ఫెడరల్ ఎన్నికలలో ఓటు వేసేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని వైట్ హౌస్ సైతం పట్టుబడుతోంది. ప్రస్తుతం ట్రంప్ ఒత్తిడి తెస్తున్న ఈ ‘సేవ్ అమెరికా యాక్ట్’ బిల్లు ప్రకారం.. అమెరికాలో ఫెడరల్ ఎన్నికల ఓటరుగా నమోదు చేసుకోవాలంటే పౌరసత్వ రుజువుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని సమర్పించడం తప్పనిసరి అవుతుంది. అనారోగ్యం, వైకల్యం, సైనిక సేవ లేదా ప్రయాణాల్లో ఉన్నవారికి మాత్రమే మెయిల్-ఇన్ బ్యాలెట్లను పరిమితం చేయాలని ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. అమెరికా పౌరులు కాని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించేలా రాష్ట్రాలను ఆదేశించే ఈ బిల్లును కాంగ్రెస్ వెంటనే ఆమోదించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

