ఏపీలో స్థానిక సంస్థల సమరానికి మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వార్డుల విభజన మరియు సంఖ్య పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపల్ పరిధిలో డివిజన్లు, వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.
Also Read : కిమిడి సోదరుల మధ్య కుర్చీ పోరు..!
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త జీవోల ప్రకారం, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని వార్డుల పునర్విభజన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లలో డివిజన్లను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక ఎన్నికలు కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read : ధురంధర్ ఎఫెక్ట్.. మరీ అంత భయమా..!
వార్డుల సంఖ్య పెంచడం ద్వారా నిధుల కేటాయింపు మరియు అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు వీలుగా, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే స్థానిక నాయకులకు అప్పగించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో మున్సిపల్ శాఖ అధికారులు హద్దుల గుర్తింపు, ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

