ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఎప్పటినుంచో ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. అయితే 2024 తర్వాత కొంతమంది ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోవడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కనీసం ఒక్క చర్చలో కూడా పాల్గొనకుండా, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా, కేవలం మీడియా సమావేశాలతో కాలయాపన చేస్తున్న పలువురు శాసనసభ్యుల విషయంలో ఇటీవల కాలంలో పెద్ద చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం అయింది.
Also Read : పాపం ఎమ్మెల్యే.. కొత్త నేత దెబ్బకు ఉక్కిరిబిక్కిరి
తాజాగా దీనిపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో జరిగిన ఆలిండియా స్పీకర్ల సదస్సుకు అయ్యన్నపాత్రుడు.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. కొంతమంది సభ్యులు అసలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా, ఒక్క చర్చలో కూడా పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని, దీనిని లోక్సభ స్పీకర్ దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. క్రమం తప్పకుండా వేతనాలు పొందుతున్నప్పుడు ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు. అసలు ఇది ఏ విధంగా సాధ్యమని, ఏ విధంగా సమంజసం అంటూ అయ్యన్నపాత్రుడు ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనగా మారింది.
Also Read : ఎంపీలకు లోకేష్ క్లాస్.. పార్లమెంట్ కు వెళ్లాల్సిందే
ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే జీతాల్లో కోత విధించినప్పుడు ప్రజాప్రతినిధులకు కూడా అదే విధంగా రూల్ ఉండాలని అయ్యన్నపాత్రుడు కోరారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోతే ప్రజా కోర్ట్ లోనే వారిని నిలబెట్టాలని.. అందరికీ ఇది గుణపాఠం కావాలని అయ్యన్నపాత్రుడు కోరారు. కాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీనిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కెసిఆర్ కు జీతాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని అయినప్పటికీ కూడా ఆయన అసెంబ్లీకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

