తెలంగాణలో జనసేన పార్టీ పోటీకి సంబంధించి గత వారం పది రోజులుగా సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎక్కువగా పర్యటిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పోటీ చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం జరిగింది. ఇక దీనిపై జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏ విధంగా రాజకీయం చేయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రస్తుతం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బలహీనంగా ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ను ఎదుర్కొనే విషయంలో.. బిజెపి కొంత గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Also Read : జగన్ అధికారంలో అక్రమాలు – బయటపడితే వేధింపులా..?
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను సీరియస్ గా తీసుకున్న బిజెపి పెద్దలు.. ఎంపీటీసీ ఎన్నికల విషయంలో గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంపీటీసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలి అంటే ఆంధ్ర ఫార్ములాను అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 2021లో బీజేపీ తృటిలో.. మేయర్ పీఠాన్ని ని కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బి ఆర్ ఎస్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ప్రాంతంలో హైడ్రా విషయంలో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే ప్రచారం.. మూసి విషయంలో జరుగుతున్న పరిణామాలు.. అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి భావిస్తోంది.
Also Read : పోలవరం వాడుకోండి.. తెలంగాణాకు చంద్రబాబు చురకలు..!
అందుకే త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా బిజెపి పెద్దలు అడుగులు వేస్తున్నారు. అక్కడి నుంచే పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించి ఆయనకున్న ఇమేజ్ ను వాడుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ బహిరంగ సభ నిర్వహించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం విషయంలో దూకుడుగా ఉన్న నేపథ్యంలో.. ఆయనను తెలంగాణలో పూర్తిస్థాయిలో వాడుకుంటే మరిన్ని ఫలితాలు వస్తాయి అని బిజెపి ధీమా గా కనపడుతోంది.

