“మీ భూమి–మీ హక్కు” అన్నది రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు వివాదాల్లేని, తప్పుల్లేని క్లీన్ డాక్యుమెంట్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీ-సర్వే చేపడుతోందని తెలిపారు. మండపేట నియోజకవర్గం రాయవరంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ కొత్త విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య, రాజముద్రతో కూడిన “మీ భూమి–మీ హక్కు” పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
Also Read : మంచి జరుగుతుంటే తట్టుకోలేక కుట్రలు
కొత్త టెక్నాలజీతో ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా పాస్ పుస్తకాలను రూపొందించామని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తక్షణమే తెలుసుకునేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుందని సీఎం వివరించారు. రీసర్వే పూర్తైన 6688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించామని, ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతులు, భూ యజమానులకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజావేదిక నుంచి మాట్లాడిన సీఎం, భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాకుండా తరతరాల విశ్వాసం, కుటుంబంతో ముడిపడ్డ సెంటిమెంట్ అని పేర్కొన్నారు. గత పాలకులు భూ పత్రాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి ఫోటోలు వేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములను కబ్జా చేసే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆ చట్టాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశానని, రైతుల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చామని తెలిపారు.
Also Read : భారత్ కు భయపడుతోన్న బంగ్లా ఆటగాళ్ళు..?
పట్టాదారు పాస్ పుస్తకాలను తహసీల్దార్ కార్యాలయాల్లో కాకుండా గ్రామసభల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించామని సీఎం తెలిపారు. రీసర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, రైతుల సమక్షంలో జరగాలని, ఈకేవైసీ పూర్తయిన తర్వాతే పాస్ పుస్తకాలు ముద్రిస్తామని చెప్పారు. భూ రికార్డులను ట్యాంపర్ చేయకుండా బ్లాక్చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, ఎక్కడైనా తప్పులు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూ వివాదాల పరిష్కారానికే ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన సీఎం, నిషేధిత జాబితాలోకి బలవంతంగా చేర్చిన భూములను తొలగిస్తున్నామని, ఆర్వోఆర్, ఎఫ్ లైన్ వంటి రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రైతులు, భూ యజమానులకు ప్రయోజనం చేకూరేలా అధికారాల వికేంద్రీకరణ చేశామని, ఈ ప్రక్రియను యజ్ఞంలా నిర్వహించి ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

