వైసీపీ నేతల తీరుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీలో జగన్ చెప్పిన మాటే వేదం. దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు.. అని రజనీకాంత్ అరుణాచలం సినిమా డైలాగ్ను జగన్ బాగా గుర్తుపెట్టుకున్నట్లున్నారు. జగన్ శాసిస్తాడు.. కార్యకర్తలు పాటించాలి.. అని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఒక హెడ్ మాస్టర్ మాదిరిగా జగన్ హోమ్ వర్క్ ఇస్తే.. స్టూడెంట్స్ మాదిరిగా సైలెంట్గా చేయాల్సిందే తప్ప.. సార్.. మా వల్ల కాదు.. మేము చేయలేం అని ఎదురు చెబితే.. గోడ కుర్చీ వేయించినట్లు.. చెడామడా చీవాట్లు పెడతారు జగన్. అందుకే వైఎస్ జగన్ నోటీ నుంచి మాట వస్తే.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నోరెత్తకుండా సూపర్ అనేస్తారు తప్ప.. అన్న ఏంటి ఇలా అన్నారు.. అని మాత్రం ఒక్కసారి కూడా అనరు.
Also Read : యూత్కు టీటీడీ బ్రేక్ దర్శనం ఆఫర్.. కండీషన్ ఇదే..!
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు, కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వైసీపీ అధినేత జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని.. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో కనీసం 500 మంది సంతకాలు సేకరించాలని టార్గెట్ పెట్టారు. నవంబర్ 26 తర్వాత ఆ సంతకాలు పెట్టిన కాపీలను రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని జగన్ ప్రకటించారు.
జగన్ ప్రకటన తర్వాత వైసీపీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ప్రతి జిల్లా కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నుంచి నియోజకవర్గ నేతలను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్లో కూడా సంతకాలు సేకరించారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం నేతలు కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీ నిర్వహించారు. రచ్చబండకు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆశించిన మేర స్పందన రాలేదు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పగించటం లేదని.. కేవలం పీపీపీ పద్దతిలో నిర్మిస్తోందని.. తిరిగి అవి ప్రభుత్వానికే వస్తాయని ప్రజల నుంచి వైసీపీ నేతలకు ఎదురు సమాధానం వచ్చింది.
Also Read : మావోయిస్టుల అరెస్టుపై పోలీసుల సంచలన ప్రకటన.. అందుకే బెజవాడ వచ్చారా..?
దీంతో వైసీపీ నేతలు కూడా ఈ సంతకాల సేకరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మరో నాలుగు రోజుల్లో కోటి సంతకాల సేకరణ గడువు డెడ్ లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పార్టీ నేతల నుంచి జగన్ వివరాలు సేకరించారు. ఇందులో విస్తుగొలిపే అంశాలు చూసి జగన్ షాక్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 30 వేల సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో 10 వేల సంతకాలు కూడా సేకరించలేదని తెలుస్తోంది. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో వైసీపీకి 50 వేల మంది కార్యకర్తలు కూడా లేరా అని ప్రశ్నించారంట. మన కార్యకర్తల సంతకాలు తీసుకున్న సరిపోతుందని కదా.. అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. నేతల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఎలాగైనా కోటి సంతకాల కాపీలు తాడేపల్లి ఆఫీసుకు రావాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలంతా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

