కూటమి తరఫున గెలిచారు.. ఎప్పుడూ గెలవని చోట రికార్డు మెజారిటీతో గెలిచారు. వరుసగా నాలుగు సార్లు ఓడిన నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేశారు. 20 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అంతా బాగానే ఉంది.. కానీ గెలిచిన నాటి నుంచి ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఒకసారి సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తే… మరోసారి పత్రికా విలేకరులు. ఇదేంటంటే.. ఎదురు దాడి చేస్తారు కొలికిపూడి. తాజాగా పార్టీలో ఉన్న నేతపై ఆరోపణలు రావడంతో.. చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానంటూ బెదిరించారు కూడా. దీనికి 48 గంటల డెడ్ లైన్ విధించారు కొలికిపూడి.
Also Read : ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో
ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ తీవ్ర అసహనంతో ఉంది. పార్టీ పెద్దలపై కొలికిపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ ఆయన వ్యవహారంపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఓ ఎమ్మెల్యేకు పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులివ్వడమే పెద్ద విషయం. విచారణకు హాజరై వివరణ ఇచ్చుకోవడం కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి చాలా చిన్నతనం. అలాంటిది గెలిచిన 9 నెలల్లోనే 2 సార్లు పార్టీ క్రమశిక్షణా సంఘం ఎదుట కొలికిపూడి శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించారు కూడా. అయినా సరే.. కొలికిపూడి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Also Read : భారత్ పై మయన్మార్ భూకంప ప్రభావం
కొలికిపూడి వ్యవహారంపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గతంలోనే క్రమశిక్షణా సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఇంత జరిగినా కూడా కొలికిపూడి తన వైఖరిని మార్చుకోలేదు. వైసీపీ నేతలతో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోవద్దని స్వయంగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా సరే.. కొలికిపూడి మాత్రం.. వారి కోసమే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మైనింగ్ మాఫియాకు చెందిన 3 లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఇవి వైసీపీ నేతలవని తెలిసినా కూడా.. వాటిని విడిపించేందుకు కొలికిపూడి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. చివరికి ఆ విషయం బయటకు రావడంతో.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎప్పుడే ఆరు నెలల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు వెలికి తీశాడు. ఆ విషయంలో ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం సిబ్బంది పై కూడా ఆరోపణలు చేశారు. చివరికి పార్టీ అధిష్ఠానంపై కూడా పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ పెద్దలు.. పార్టీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్తలతో కూడిన త్రిసభ్య కమిటని వేశారు. తిరువూరు నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా కొలికిపూడిపై చర్యలుంటాయంటున్నారు పార్టీ పెద్దలు.

