మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ కుటుంబ పరిణామాలు వేగంగా మారాయి. రాజశేఖర్ రెడ్డి దూరం పెట్టిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ జగన్ కు దగ్గర కావడం.. రాజశేఖర్ రెడ్డి సతీమణి, కుమార్తె షర్మిల.. జగన్ కు దూరం జరగటం, వైయస్ వివేకానంద రెడ్డిని కుటుంబ సభ్యుల దారుణంగా హతమార్చడం జరిగాయి. దీనితో కుటుంబంలో జగన్ ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనే ఓ మాట ఇప్పుడు పులివెందులలో ఎక్కువగా వినపడుతోంది. భద్రతాపరమైన కారణాలతో జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగానే ఉంటున్నారు జగన్. ఈ ప్రభావం పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ఎక్కువగా చూపిస్తోంది.
Also Read : జగన్ కొత్త టార్గెట్.. ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ..?
అయితే రాబోయే ఆరు నెలల కాలంలో జగన్ పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జగన్ మరో కీలక నిర్ణయం తీసుకుని పాదయాత్రకు కూడా రంగంలోకి దిగుతారు అనే ప్రచారం సైతం జరుగుతుంది. మరి ఈ సమయంలో పార్టీ వ్యవహారాలు ఎవరు చూస్తారు అనే దానిపైనే కొంత స్పష్టత రావడం లేదు. జగన్ గతంలో పాదయాత్ర చేసిన సమయంలో వైయస్ విజయలక్ష్మి, వైయస్ షర్మిల పార్టీ వ్యవహారాలు చూసేవారు. ఆ తర్వాత భారతి కొంత నడిపించేవారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ జగన్ కు దూరమయ్యారు. విజయలక్ష్మి పార్టీకి రాజీనామా చేశారు. దీనితో జగన్ ప్రజల్లోకి వెళితే.. పార్టీ వ్యవహారాలు చూసేది ఎవరు అనేదానిపై క్లారిటీ రావడం లేదు.
Also Read : పేకాట ఆడితే జైలే.. ఏపీ హైకోర్ట్ సంచలనం
తాను నమ్మిన సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా పార్టీ నష్టపోయింది అనే భావనలో జగన్ ఎక్కువగా ఉన్నారు. దీనితో వైయస్ భారతికి పగ్గాలు అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ ఆమెను మాత్రమే నమ్ముతున్నారనేది పులివెందులలో ఎక్కువగా వినపడుతున్న మాట. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె పాల్గొనలేదు. కేవలం పులివెందుల నియోజకవర్గంలో ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం వైయస్ భారతి నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. జగన్ ప్రజల్లో ఉంటే పార్టీ వ్యవహారాలను తాను చూసుకునే అవకాశం కనబడుతోంది. ఈ మేరకు ఇప్పటికే కుటుంబంలో చర్చలు జరిగాయని.. అందుకు భారతి కూడా అంగీకారం తెలిపారని సమాచారం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.

