ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక అరెస్ట్ దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల అవకతవకలపై సిట్ తన విచారణను ముమ్మరం చేసింది. తాజాగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల్లో కారుమూరి పాత్రపై సిట్ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
Also Read : సాక్షిపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు..!
అధికారులు జారీ చేసిన నోటీసులతో కారుమూరి అరెస్ట్ తథ్యమనే ప్రచారం సర్వత్రా సాగుతోంది. సిట్ నోటీసులపై స్పందించిన కారుమూరి విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు. తన భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి రాలేనని, వారం రోజుల గడువు కావాలని కోరారు. అయితే, ఇది కేవలం విచారణ నుండి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సిట్ గడువు ఇచ్చేందుకు నిరాకరిస్తే, కారుమూరి విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.
Also Read : ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అయ్యోర్లు..!
లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు అధికారుల విచారణ కూడా పూర్తైన సంగతి తెలిసిందే. వారిచ్చిన సమాచారం మేరకు రాజకీయ నేతలపై సిట్ గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. కారుమూరి సునీల్ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో దాదాపు రెండు నెలల నుంచి ఆయన అరెస్ట్ పై ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న.. నోటీసుల పర్వం ముగియగానే, తదుపరి పరిణామం అరెస్టుల వైపు వెళ్తుందా అన్నది వేచి చూడాలి.

