శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం సెలెక్టర్ లు ప్రకటించిన జట్టులో ఒక ఆసక్తికర పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. గాయం కారణంగా సెలక్షన్ కు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ కు సెలక్టర్లు అనూహ్యంగా తొలిసారి జాతీయ జట్టు నుండి పిలుపునిచ్చారు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ లోయర్-మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేయగల సారాంశ్, సుందర్ కు సరైన ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు.
Also Read : అల్లు అర్జున్ సంచలన కామెంట్స్..!
ఇండోర్ కు చెందిన సారాంశ్ జైన్ గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడైన ప్రదర్శన ఇస్తూ వస్తున్నాడు. డిసెంబర్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అతను, ఆ తర్వాత సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 181 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్లోనూ 2,223 పరుగులు సాధించాడు. సారాంశ్ తండ్రి సుబోధ్ జైన్ కూడా గతంలో మధ్యప్రదేశ్ తరఫున 9 రంజీ మ్యాచ్ లు ఆడిన క్రికెటరే కావడం గమనార్హం.
Also Read : మేమూ బాధితులమే.. తమ్మినేని కొత్త డ్రామా..!
దేశవాళీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో సారాంశ్ తన ఆటను మరింత మెరుగుపరుచుకుని మ్యాచ్ విన్నర్ గా మారాడు. 2022లో మధ్యప్రదేశ్ జట్టు చరిత్రలోనే తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముంబైతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ముఖ్యమైన వికెట్లు కూడా తీశాడు. అలాగే దులీప్ ట్రోఫీ ఫైనల్ లో 5/49 అద్భుత ప్రదర్శనతో పాటు, ఇటీవలే ఇండియా-ఏ తరఫున శ్రీలంక-ఏ జట్టుపై 6 వికెట్లు తీసి, 70 పరుగులు చేయడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

