ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యప్రదేశ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, రూ. 249 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 22 కీలక వైద్య ప్రాజెక్టులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ నూతన సౌకర్యాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.
Also Read : నల్లమల సాగర్లో కృష్ణమ్మ పరవళ్లు.. కరువు సీమలో పచ్చని పంటలు
ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాకులు, అలాగే 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటైన క్రిటికల్ కేర్ బ్లాకుల ద్వారా తక్షణమే 500 అత్యవసర వైద్య పడకలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ వంటి అత్యంత కీలకమైన సేవలు లభిస్తాయి.
Also Read : వల్లభనేని ఆస్తుల గుట్టు విప్పిన కొడాలి..!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్న సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో ఒక పెద్ద గేమ్ ఛేంజర్గా మారబోతోందని అభివర్ణించారు. అత్యాధునిక సాంకేతికతతో ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ సంజీవని లక్ష్యమన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

