శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్ రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. గత నెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నీటిని తరలించడం ప్రారంభించగా, ప్రస్తుతం ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకుంది. శుక్రవారం నాటికి ఏకంగా 3.24 టీఎంసీల నీరు రిజర్వాయర్కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
Also Read : DSC స్పోర్ట్స్ కోటా వివాదం.. జగన్ సర్కార్ ఇచ్చిన జీవోలు నకిలీవా?
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో తొలిరోజు 500 క్యూసెక్కులతో మొదలైన నీటి విడుదల, క్రమేపీ 5 వేల క్యూసెక్కులకు చేరింది. రోజుకు సరిగ్గా 5 వేల క్యూసెక్కుల చొప్పున కొల్లంవాగు దగ్గర హెడ్రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాలు టన్నెళ్ల గుండా ప్రవహిస్తూ ఫీడర్ కాలువ ద్వారా నేరుగా నల్లమల సాగర్ రిజర్వాయర్ను చేరుతుండటం ఇంజనీరింగ్ అద్భుతం.
అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న చొరవకు ఈ జలప్రవాహమే నిదర్శనం. గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా అడుగు ముందుకు పడని వెలిగొండ ప్రాజెక్టుకు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవం పోసింది. నేడు నల్లమల సాగర్ కృష్ణా జలాలతో కళకళలాడుతుండటం చూసి రాయలసీమ, ప్రకాశం ప్రాంత రైతన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీ వైట్ వాష్ ఖాయం
పట్టుదల ఉంటే సాగునీటి ప్రాజెక్టులు కూడా ఎంత వేగంగా పూర్తవుతాయో చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. కృష్ణా జలాల రాకతో ఈ ప్రాంతంలోని మెట్ట భూములు పచ్చని సిరులు కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు దార్శనికత వల్లే వెలిగొండ కష్టాలు తీరుతున్నాయని, కూటమి ప్రభుత్వ పాలనలో తమ రాత మారబోతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

