అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కు సంబంధించి యూఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసా నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కంపెనీల తాజా జాబితాను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ విడుదల చేసింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గౌరాటెక్ ఎల్ఎల్సీ, రెనోటెక్ గ్రూప్, సీలోజ్, షెర్వుడ్ అకాడమీ అనే నాలుగు ప్రముఖ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నిర్దిష్ట కాలం పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ ఇంట్రస్టింగ్ చర్చ..!
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం.. ఒక కంపెనీ లేబర్ కండిషన్ అప్లికేషన్ దాఖలు చేసే సమయంలో కావాలనే తప్పుడు సమాచారాన్ని అందించినా, లేదా విదేశీ ఉద్యోగుల నియామకంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా పాటించకపోయినా ఆ సంస్థను విల్ ఫుల్ వయలేటర్ గా గుర్తిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జరిపే అధికారిక విచారణలో ఈ తప్పులు రుజువైతే సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ బ్లాక్ లిస్ట్ లో చేరిన కంపెనీలు తమకు కేటాయించిన నిషేధిత కాలంలో కొత్తగా ఎలాంటి హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హత కోల్పోతాయి.
Also Read : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..!
ఈ నిషేధం వల్ల సదరు కంపెనీలపై రాబోయే ఐదేళ్ల పాటు అమెరికా ప్రభుత్వ అదనపు ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ కంపెనీలు భవిష్యత్తులో హెచ్-1బీ ఉద్యోగులను తీసుకునే క్రమంలో స్థానిక అమెరికన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించలేదని నిరూపించుకోవడంతో పాటు, వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి రాబోయే ఐదేళ్ల పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఈ సంస్థలపై ఎప్పుడైనా ఆకస్మిక దాడులు నిర్వహించే అవకాశం ఉంటుంది.

