తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ చేసిన పని పైన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. కొంతమంది ఏమో.. ఇలాగే చేయాలంటుంటే.. మరి కొందరేమో.. ఇలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రచారం కోరుకుంటారు. “పావలా కోడికి ముప్పావల మసాలా అని..” అదేదో సామెత ఉన్నట్లుగా చేసే పని చాటంత అయినా సరే.. దానికి చాపంత ప్రచారం చేసుకోవడంలో రాజకీయ నేతల తర్వాతే ఎవరైనా. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం.. ప్రచారం కంటే.. పని ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే అటు సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా ఆయనకు ఇప్పుడు నీరాజనాలు పలుకుతున్నారు.
Also Read : సీదిరి అప్పలరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలనం..!
సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ నెల 22వ తేదీన “తల్లికి వందనం” పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. చెప్పినట్లుగా ప్రతి విద్యార్థికి రూ.13 వేలు నేరుగా తల్లి అకౌంట్లో జమ అయ్యాయి. ఒకరుంటే 13 వేలు, ఇద్దరు పిల్లలుంటే 26 వేలు, ముగ్గురు పిల్లలుంటే 39 వేలు, నలుగురు పిల్లలుంటే 52 వేలు, ఐదుగురు పిల్లలుంటే 65 వేలు, ఆరుగురు పిల్లలుంటే 78 వేల రూపాయలను నేరుగా అకౌంట్లో జమ చేశారు. ఇందులో పార్టీలు చూడలేదు. కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా పని చేసిన ఓ వైసీపీ కార్యకర్తకు ఆరుగురు పిల్లలు. గత ఎన్నికల్లో అతను టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు కూడా. అయినా సరే.. ఇప్పుడు అతని భార్య ఖాతాలో ఏకంగా 78 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. అంతే తప్ప కుంటి సాకులు చెప్పి కోతలు పెట్టలేదు.
“తల్లికి వందనం” పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ది జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏకంగా రూ.10,121 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇవన్నీ ఇప్పుడు తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఎవరికైనా రాకపోతే సమీపంలో ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు కూడా. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా సరే ఒక్కరికే ‘అమ్మఒడి’ అమలు చేయగా, కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి “తల్లికి వందనం” పథకాన్ని వర్తింపజేస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కోసం ఏడాదికి 6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు. కానీ కూటమి సర్కార్ మాత్రం ఈ ఏడాది మాత్రమే ఏకంగా రూ.10,121 కోట్లు కేటాయించింది.
ఇక అసలు విషయం ఏమిటంటే.. “తల్లికి వందనం” పథకం నిధుల జమ కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గతంలో అమ్మఒడి పథకం జమ కోసం జగన్ సభలు నిర్వహించారు. ఆ రోజు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. అలాగే జగన్ పర్యటన మార్గంలో పరదాలు కట్టారు. చెట్లు కొట్టేశారు. ఇక ఆ వేదికపై నుంచి పిల్లలతో కీర్తనలు పాడించారు. రాజకీయ విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టించారు. పిల్లలను ఎండలో తిప్పారు. ఇక ప్రతిపక్ష నేతల బొమ్మలు పెట్టించి.. వాటిని తన్నించారు. ఆ తర్వాత బటన్ నొక్కారు. అయితే ఆ డబ్బులు మాత్రం నెల రోజుల వరకు చాలా మందికి చేరలేదు. కొంతమందికి అయితే రెండు నెలలకు జమ అయ్యాయి.
Also Read : దేశంలో విశాఖ టాప్.. కుప్పలుగా ఉద్యోగాలు
కానీ కూటమి సర్కార్ వరుసగా రెండో ఏడాది ఇచ్చిన “తల్లికి వందనం” నిధులు జమ చేసేసింది. అది కూడా ఎలాంటి హడావుడి లేకుండా. సైలెంట్గా 10 వేల 121 కోట్ల రూపాయలను నేరుగా ఖాతాల్లో జమ చేసేసింది. తొలి రోజే దాదాపు 70 శాతం మంది తల్లుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి. అయితే ఈ నిధులు విడుదల చేసేందుకు ఎలాంటి బహిరంగ సభ ఏర్పాటు చేయలేదు. ఒక్క స్కూల్కు కూడా సెలవు ఇవ్వలేదు. ఒక్క విద్యార్థిని కూడా ఇబ్బంది పెట్టలేదు. వైసీపీ నేతలను తిట్టించలేదు. ఇంకా చెప్పాలంటే.. “తల్లికి వందనం” పథకం నిధులు జమ అవుతున్న సందర్భంలో మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు.. మన లోకేష్.. కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖ అధికారులతో రివ్యూలో ఉన్నారు. అంతే కానీ.. బహిరంగ సభ లేదు.. హడావుడి లేదు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతలను అసహనానికి గురి చేస్తోంది. 10 వేల కోట్ల రూపాయలను నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం.. ప్రచారం చేసుకోవాలి కదా.. ఇలా ఎలా చేస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. ఇలా చేయడం ఏమన్నా భావ్యమా.. అంటున్నారు. మినిమం ప్రచారం అయినా ఉండాలి కదా.. అంటున్నారు.

