ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుండగానే.. అంతర్గత అసంతృప్తులు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. నియోజకవర్గ సీనియర్ నేత, మాజీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం సాగుతోంది.
Also Read : వెలుగులోకి మరో వైసీపీ నేత భూ దందా.. మరి అరెస్టు ఎప్పుడు..?
ఉండి నియోజకవర్గ పార్టీ బలోపేతానికి, క్యాడర్ ను నడిపించడంలో పీవీఎల్ నరసింహారాజు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య వైసీపీ అధిష్ఠానం ఉండి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బాధ్యతలను మంతెన యోగేంద్ర కుమార్ కు అప్పగించింది. అదే సమయంలో సర్దుబాటు చర్యల్లో భాగంగా పీవీఎల్ నరసింహారాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆయనను నియోజకవర్గ ప్రత్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఉద్యమం విస్తరిస్తోంది.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..!
నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పీవీఎల్ నరసింహారాజును ఉన్నపళంగా తప్పించడంపై ఆయన అనుచరులు, స్థానిక క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన నాయకుడిని కాదని, వేరే వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీనపడుతుందని హెచ్చరిస్తున్నారు. తనకు జరిగిన అవమానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పీవీఎల్ నరసింహారాజు, పార్టీలో కొనసాగడం కష్టమేననే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు మరియు అనుచరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

