హైకోర్టుల్లో విచారణలు ముగిసిన తర్వాత తీర్పుల వెల్లడిలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని అరికట్టేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ కేసుల్లో విచారణలు పూర్తయ్యాక కూడా తీర్పులను సుదీర్ఘకాలం రిజర్వ్ లో ఉంచడంపై కోర్టు సీరియస్ అయింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం లీగల్ సిస్టమ్ లో పారదర్శకత, వేగం పెంచేలా ఈ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది.
Also Read : బెంబేలెత్తిస్తున్న ఎబోలా.. హైఅలర్ట్..!
ఈ తాజా మార్గదర్శకాల ప్రకారం కోర్టులు ఏదైనా కేసులో విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వ్ చేస్తే.. దానిని గరిష్ఠంగా మూడు నెలల లోపు ఖచ్చితంగా వెలువరించాల్సి ఉంటుంది. ఇక అత్యంత కీలకమైన బెయిల్ పిటిషన్ల విషయంలో కూడా కోర్టు గడువులను ఖరారు చేసింది. బెయిల్ పిటిషన్లపై ఇచ్చే ఉత్తర్వులను అదే రోజు ప్రకటించడంతో పాటు, వెంటనే కోర్టు అధికారిక వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల బెయిల్ ఉత్తర్వులను రిజర్వ్ చేయాల్సి వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరుసటి రోజే వాటిని ప్రకటించాలని ఆదేశించింది.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలనం..!
ఖైదీల వ్యక్తిగత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకుని బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే సంబంధిత జైలు అధికారులకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ఖైదీల విడుదల ప్రక్రియ సాధ్యమైనంత వరకు అదే రోజు పూర్తి కావాలని, కుదరని పక్షంలో కనీసం మరుసటి రోజు లోపైనా విడుదల జరిగిపోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల అమలు సరిగ్గా జరుగుతోందో లేదో పర్యవేక్షించేందుకు, బెయిల్ ఆర్డర్స్ అమలుపై సంబంధిత ట్రయల్ కోర్టు తప్పనిసరిగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలనే నిబంధనను కూడా చేర్చింది.

