గత కొన్నాళ్ళుగా వివాదాస్పదంగా మారిన.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిని సినిమా స్టైల్ లో కిడ్నాప్ చేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారి తీస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 340సీ జాతీయ రహదారిపై పాములపాడు మండలం రుద్రవరం వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద బుధవారం ఈ హైడ్రామా చోటుచేసుకుంది.
Also Read : ఎంపీ మిథున్ రెడ్డిది అహంకారమా.. సమాచార లోపమా?
స్థానిక మీడియా కథనం ప్రకారం.. టోల్ ప్లాజా వద్ద ఏదో విషయంలో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టోల్ప్లాజా ఉద్యోగి మహేష్ను ఎమ్మెల్యే అనుచరులు లేదా ఆయన సమక్షంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ చూస్తుండగానే ఒక ఉద్యోగిని కారులో వేసుకుని వెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో, స్థానికుల సెల్ ఫోన్లలో రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.
Also Read : వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. భయపెడుతున్న సెంటిమెంట్..!
మహేష్ కిడ్నాప్ వార్త తెలియగానే అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆందోళనకు దిగారు. విషయం తీవ్రతరం కావడంతో.. అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో, ఎమ్మెల్యే వర్గీయులు మహేష్ ను తిరిగి విడుదల చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై బాధితుడు గాని.. టోల్ ప్లాజా యాజమాన్యం గానీ.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఫారెస్ట్ అధికారులతో వివాదంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

