ఏపీలో మంత్రివర్గ విస్తరణపై కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గ మార్పులు ఉంటాయని.. అందులో తమకు అవకాశం ఉంటుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు నీళ్లు కుమ్మరిస్తున్నారు. కేబినెట్ మార్పులు, చేర్పులపై అసలు ఆయన కసరత్తే చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ, పోలవరం పనుల పూర్తి వంటి భారీ లక్ష్యాలు ఆయన ముందున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కూడా పూర్తికాకముందే మంత్రివర్గంలో మార్పులు చేస్తే, అది అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పాలనాపరమైన అయోమయానికి దారితీస్తుంది. అందుకే, ప్రస్తుతం తన ఫోకస్ అంతా మిషన్ బిల్డ్ ఏపీపైనే తప్పు, రాజకీయ పదవుల పంపకంపై లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
Also Read : బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి బలపడుతుందా..?
సాధారణంగా మంత్రులకు తనదైన శైలిలో రిపోర్ట్ కార్డ్స్ ఇస్తుంటారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించి, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపడానికి కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అప్పుడే ఎవరు సమర్థులు, ఎవరు విఫలమయ్యారనేది స్పష్టమవుతుంది. ఇప్పుడున్న మంత్రుల పనితీరును ర్యాంకింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న సీఎం, ఇప్పుడే మార్పులు చేసి వారిలో నిరాశ నింపడం కంటే, వారిని మరింత ఉత్సాహపరిచి పని చేయించుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద సవాలు సూపర్ సిక్స్ హామీల అమలు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచడంపై సీఎం సీరియస్ డెడ్ లైన్లు విధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, రాజకీయ సమీకరణాల కోసం పదవులు పంచుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే విషయం చంద్రబాబుకు తెలుసని అంటున్నారు. రాజకీయాల కంటే ప్రజా సేవ అన్న నినాదంతోనే ముందుకు వెళ్లాలని తన కేబినెట్ సహచరులకు సైతం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.
Also Read : అమరావతి రైతులతో జగన్ గేమ్ ప్లాన్ స్టార్ట్..!
మంత్రి పదవులు దక్కుతాయని ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే మిగిలేలా ఉంది. రాజకీయ అవసరాల కంటే పాలనాపరమైన అవసరాలకే చంద్రబాబు పెద్దపీట వేస్తారు. ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ తమ స్థానాల్లో సురక్షితంగా ఉన్నారని, కేబినెట్ విస్తరణ అనేది ప్రస్తుతానికి అజెండాలోనే లేని అంశమని స్పష్టమవుతోందని అనుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం జరగడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అది పదవులు ఆశిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు తమ పేర్లను చర్చల్లో ఉంచడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని చూడటం.. కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయని చూపేందుకు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి లీకులను వదులుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న దృఢమైన సమన్వయం దృష్ట్యా, ఇటువంటి ప్రచారాలు కూటమిపై పెద్దగా ప్రభావం చూపడం లేదని భావిస్తున్నారు.

