వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు సిబిఐ అనేక కీలక విషయాలను వెలికితీయగా, తాజాగా ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించడంతో సరికొత్త మలుపు తిరిగింది. వివేకాను అంతమొందించేందుకు ఏకంగా రూ. 40 కోట్ల భారీ సుపారీ నడిచిందనే సంచలన కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన తాజా స్టేట్మెంట్ రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read : భార్య దగ్గరకు విజయ్.. లండన్ టూర్ అందుకే అని టాక్..?
వివేకానంద రెడ్డి హత్య కుట్ర వెనుక రూ. 40 కోట్ల భారీ ఆర్థిక లావాదేవీలు జరిగాయని దస్తగిరి స్పష్టం చేశారు. ఈ హత్య కుట్రలో భాగంగా తనకు రూ. 5 కోట్లు ఇస్తామని సూత్రధారులు ఒప్పందం చేసుకున్నారని, అందులో కొంత మొత్తాన్ని ముందస్తుగా తన అకౌంట్లో డిపాజిట్ కూడా చేశారని ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. దస్తగిరి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని తవ్వితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. దస్తగిరి బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీల ఆర్థిక మూలాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
Also Read : కొండా సురేఖ సంచలన పోస్ట్.. ఏం చేస్తారో..!
సీబీఐతో కలిసి రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. ఆ రూ. 40 కోట్ల భారీ నగదు ఎవరి ఖాతాల నుంచి ఎక్కడెక్కడికి మళ్లింది? హత్యా రాజకీయం కోసం ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చిన అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ‘మనీ ట్రైల్’ పై గట్టి నిఘా పెట్టారు. వివేకా హత్య కేసు కేవలం వ్యక్తిగత శత్రుత్వమా లేక దీని వెనుక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందా అనే మిస్టరీ వీడాలంటే ఈ రూ. 40 కోట్ల ఆర్థిక లెక్కల తేలాల్సిందేనని అధికారులు భావిస్తున్నారు. ఈ నగదు బదిలీల వెనుక ఉన్న అసలు మూలాలను ఈడీ గనుక పక్కా ఆధారాలతో తవ్వితీస్తే, ఈ దారుణ హత్య వెనుక ఇన్నాళ్లూ తెరమరుగున ఉన్న అసలు సూత్రధారులు, పెద్ద తలకాయలు త్వరలోనే చట్టానికి దొరికిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

