పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన మందా సాల్మన్ మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో, ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలపై స్థానికుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన నేపథ్యం, హతుడి నేర చరిత్ర, అలాగే గ్రామస్థులు ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే, ఇది రాజకీయ హత్య కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణగా కనిపిస్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తగా గుర్తింపు పొందిన మందా సాల్మన్పై గతంలో సుమారు 12 క్రిమినల్ కేసులు నమోదైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. వాటిలో ఒక అత్యాచార కేసుతో పాటు (స్వంత సామాజిక వర్గానికి చెందిన వివాహితపై), ఐదు ఇతర క్రిమినల్ కేసులు, ఆరు దొంగతనం కేసులు ఉన్నాయి.
Also Read : కోడి పందాల జోష్.. ప్రభుత్వానికి భారీ ఆదాయం..
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, అప్పటి ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అండతో సాల్మన్ పిన్నెల్లి గ్రామంలో సుమారు 15 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని దళితులు తన ఆధీనంలోనే ఉండాలంటూ బెదిరింపులకు పాల్పడేవాడని, ఎదురు తిరిగిన వారిపై భూములు లాక్కోవడం, కప్పం వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే
ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న మొటమర్రి పేతురు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత ఘర్షణను కుల, రాజకీయ కోణాల్లోకి మళ్లిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కాలంలో పేతురును కాళ్లు, చేతులు కట్టేసి, రాడ్లతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో కూడా సాల్మన్ పాత్ర ఉందని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. సాల్మన్ వేధింపులు భరించలేక సుమారు 40 దళిత కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చిందన్న అంశం అప్పటి పరిస్థితుల తీవ్రతను సూచిస్తోందని వారు చెబుతున్నారు.
ఘటన రోజు ఏమి జరిగింది?
స్థానికుల కథనం ప్రకారం, జనవరి 8న సాల్మన్ గ్రామానికి వచ్చాడు. జనవరి 9న మద్యం మత్తులో గ్రామంలో ప్రజలను దూషించడం ప్రారంభించాడు. జనవరి 10న పొలానికి వెళ్తున్న మొటమర్రి పేతురుపై సాల్మన్ రాయి విసిరి, అనంతరం రాడ్డుతో దాడి చేశాడు. బండి ఆపిన తర్వాత కూడా విచక్షణారహితంగా పేతురుపై దాడి కొనసాగించాడు. ఆత్మరక్షణ కోసం పేతురు సాల్మన్ తీసుకొచ్చిన రాడ్డును లాక్కొని ఎదురుదాడి చేయగా, అందులో సాల్మన్కు గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ సాల్మన్ మృతి చెందినట్లు సమాచారం.
Also Read : విజయసాయి కి ఈడీ నోటీస్: జగన్ అరెస్టుకు సన్నాహామేనా?
సాల్మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్పందించని కాసు మహేష్ రెడ్డి తదితర వైసీపీ నేతలు, అతను మృతి చెందిన అనంతరం మాత్రమే రంగప్రవేశం చేయడంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంగా వినియోగించుకొని గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే యత్నం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
శవాన్ని గ్రామానికి తరలించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రప్పించి రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం జరిగినప్పటికీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ యోచనను అడ్డుకున్నారని సమాచారం. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అమాయకుడిగా చిత్రీకరిస్తూ, పల్నాడు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అంశంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

