మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 22న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఇదివరకు ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి, మద్యం స్కాం ఎలా జరిగిందో, అందులో వైసీపీకి చెందిన ఎవరెవరు పాత్రధారులుగా ఉన్నారో వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన చేసిన ఆరోపణలను వైసీపీ గట్టిగా ఖండించలేకపోవడం అప్పట్లోనే అనేక అనుమానాలకు తావిచ్చింది.
Also Read : కోడి పందాల జోష్.. ప్రభుత్వానికి భారీ ఆదాయం..
విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం వెనుక కూడా ఇలాంటి కేసుల నుంచి రక్షణ పొందాలనే ఉద్దేశమే ఉందన్న ఊహాగానాలు అప్పట్లో బలంగా వినిపించాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఈడీ నేరుగా నోటీసులు ఇవ్వడం చూస్తే, అన్నీ అనుకున్నట్లుగా జరగలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే క్రమంలో, ఈ కేసులో అంతిమ లబ్దిదారుగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయనపై చర్యలకు సన్నాహాలు చేస్తుందా? అనే అనుమానం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాకపోయినా, కూటమి ప్రభుత్వానికి నిరంతరం రాజకీయ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వాన్ని అడ్డుకోవడం దీనికి తాజా ఉదాహరణ.
Also Read : మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం కూడా ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఆ సమావేశం తర్వాత జగన్కు ప్రమాద సంకేతాలు మోగవచ్చని అప్పుడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు అదే మద్యం కుంభకోణం కేసులో, అంతిమ లబ్దిదారుగా జగన్ పేరు వినిపిస్తున్న వేళ, విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం కేవలం ఆయన పాత్రను నిర్ధారించడానికేనా? లేక అసలు లక్ష్యం ఇంకెక్కడికో ఉందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ నోటీసులు అంతిమ లబ్దిదారుడిపై చర్యలకు ముందస్తు సన్నాహాలే అయితే, ఇది ఖచ్చితంగా జగన్ ప్రసిద్ధిగా వాడే ‘రప్పా రప్పా’ రాజకీయానికి తిరుగు దెబ్బగా చెప్పుకోవాల్సిందే.
తుంటిపై కొడితే మూతి పళ్ళు రాలినట్టే ఈ పరిణామాలు ఉంటాయా? లేదా ఇవన్నీ రాజకీయ ఊహాగానాలకే పరిమితమవుతాయా? అన్నది మాత్రం త్వరలోనే తేలనుంది.

