పులివెందులలో వైకాపా కబ్జాదారులకు కొందరు పోలీస్ అధికారులు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నరేడ్డి సునీత ‘విపశ్యన’ ధ్యాన కేంద్రానికి కేటాయించాలనుకున్న భూమిని కబ్జా చేసేందుకు నిందితులు యత్నించారు. దీనిపై పులివెందుల ఆర్డీవో జి.చిన్నయ్య ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, స్థానిక సీఐ కె.శ్రీరామ్ వారం రోజుల పాటు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు.
Also Read : ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
పైగా అక్రమార్కులతో రాజీపడాలని ఉచిత సలహాలు ఇవ్వడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐని వీఆర్ కు పంపుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పులివెందుల ప్రాంత ప్రజల కోసం నరేడ్డి సునీత రూ. 3 కోట్లు వెచ్చించి విపశ్యన ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. దీని నిర్వహణకు రూ. 3.30 కోట్ల విలువైన 11 ఎకరాల సొంత భూమిని బదలాయించారు. ఈ ధ్యాన కేంద్ర విస్తరణకు చిన్నరంగాపురం సర్వే నంబర్ 160/1బీలో మరో 3.33 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : మళ్లీ తెరపైకి జమిలీ రచ్చ..!
అయితే, 2011 నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కబ్జా చేసేందుకు నలుగురు వ్యక్తులు పథకం వేశారు. అసలైన దస్తావేజులు లేకుండానే వెబ్ల్యాండ్లో నకిలీ ఎంట్రీలు చేయించి, ఆపై తమ అనుచరుల పేరిట మార్చుకున్నారు. దీనిపై ఆర్డీవో విచారణ జరిపి నకిలీ పత్రాలను రద్దు చేస్తూ, నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పులివెందుల పట్టణ పోలీసులకు ఫిర్యాదు కాపీని పంపారు. ఆర్డీవో ఫిర్యాదు చేసినా సీఐ శ్రీరామ్ కేసు నమోదు చేయకపోగా, జిల్లా ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read : మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్..!
అయినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం, బాధితులు కేసు పురోగతిపై ఆరా తీస్తే ‘నిందితులతో మాట్లాడి రాజీ చేయిస్తాను’ అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం వివాదాస్పదమైంది. రాజ్ పేరిట కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐ తీరు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ కోయ ప్రవీణ్ దృష్టికి వెళ్లడంతో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ కేసులో భూములు కబ్జా చేసేందుకు యత్నించిన వైకాపాకు చెందిన చవ్వా శ్రీనివాసులరెడ్డి, కొమ్మ శివచంద్రరెడ్డి, మొయిళ్ల మనోహర్ రెడ్డి, పల్లెటి రాఘవరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల వివరాలు కూడా వెలికితీయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

