తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేచిందా? కొండా సుస్మిత జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె జనసేన పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ కానున్నారనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్పై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా జనసేన నేతలతో భేటీకి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్..!
జనసేనలో చేరిక అంశంతో పాటు వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో జనసేనకు బలమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే వ్యూహంలో భాగంగా సుస్మితను పార్టీలోకి ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Also Read : బీజేపీకి జగన్ గుడ్బై..? ఈడీ దూకుడు వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా..?
జూబ్లీహిల్స్లో కీలక భేటీ?
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కీలక నేత నివాసంలో కొండా సుస్మితతో జనసేన ముఖ్య నేతల భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ చేరికతో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ విస్తరణ, పరకాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ భేటీకి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఒకవేళ సుస్మిత జనసేనలో చేరితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read : నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే సరికొత్త పొలిటికల్ క్యాంపెయిన్..!
ఇప్పటికే తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా తన ప్రాబల్యాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొండా సుస్మిత వంటి నేత చేరిక పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ అనంతరం ఈ ప్రచారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుస్మిత జనసేనలో చేరుతారా? పరకాల టికెట్పై ఏదైనా హామీ లభిస్తుందా? ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారా? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

