ఏ ఒక్కరి పట్ల కాంట్రాక్టర్లకు విధేయత ఉండదు. అధికారంలో ఎవరున్నా వారికి ఒకటే.. వ్యాపారం మాత్రమే వారి ఏకైక లక్ష్యం. నీకెంత.. నాకింత అనేదే కాంట్రాక్టు వ్యవస్థ.. కొందరు కాంట్రాక్టర్లు.. కొందరి వారిగా ఉంటారు. కానీ ఈ మెగా కాంట్రాక్టర్ మాత్రం అందరి వాడు అయ్యారంటే, ఆయన ఎంత లౌక్యం ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కమిషన్ల కోసం పాలకులు, వారి వారసుల చుట్టూ నిత్యం కన్పించే వ్యక్తులు, మంత్రులు కక్కుర్తి పడినంత కాలం, కాంట్రాక్టు వ్యవస్థ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.
కాంట్రాక్టర్లకు కులం పిచ్చి ఉండదు.. పార్టీల పిచ్చి ఉండదు.. వారికి ఉండేది వ్యాపారం పిచ్చి మాత్రమే. వారికి ఉన్న ఏకైక పిచ్చి.. పాలకులకు కానుకల రూపంలో.. ఎన్నికల ఫండ్ కోట్లు కమీషన్లు ఇవ్వాలి.. పనుల అంచనాలను రెట్టింపు పెంచుకోవాలి… పంచుకోవాలి.. తాజా గా ఒక కాంట్రాక్టర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముగ్గురు ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడైనా ఒక మెగా కాంట్రాక్టర్ ఉన్నారు. అందులో ఒకరు మాజీ సీఎం కేసీఆర్, మరో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురిని తన మాయమాటలతో, బుట్టలో వేసుకున్న ఆ మెగా కాంట్రాక్టర్ తెలివితేటలకు హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు.
కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు అంటే మా చెడ్డ కోపం. ఇంకా చెప్పాలంటే.. ఆయనను బద్ధ శత్రువుగా చూస్తుంటారు. కానీ ఈ మెగా కాంట్రాక్టర్ మాత్రం ఆ ముగ్గురిని తన దారికి తెచ్చుకోవటంలో సూపర్, డూపర్ హిట్ అయ్యారంటే.. ఆయన చెప్పే మాటల ప్రభావం ఎంతగా పని చేసిందో స్పష్టమవుతోంది. ఇటీవల ఆ మెగా కాంట్రాక్టర్ ముద్దుల భార్య ధరించిన సుమారు రూ. 150 కోట్ల విలువైన నగ ధరించిన విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంవత్సరానికి వందల కోట్లు సంపాదించే మెగా కాంట్రాక్టర్ భార్యకు ఆ మాత్రం నగలు ధరించే అర్హత ఉండదా..?. భర్త వందల కోట్ల సంపాదన ప్రజలకు తెలియాలంటే భార్య ధరించిన వందల కోట్ల బంగారం నగలే అందుకు నిదర్శనం. రెండు రాష్ట్రాల్లో మెగా కాంట్రాక్టర్ మాటల మాయలో పడని సీఎంలు ఉండకుండా ఉంటారా..! అంతా కోట్ల ప్రభావమే పని చేస్తుందన్న ప్రచారంలో నూటికి నూరు శాతం నిజం లేకపోలేదు.

