సొంత కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి గట్టి షాక్ ఇచ్చింది. తమ వాహనాల శ్రేణిపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పెరిగిన ఈ కొత్త ధరలు రాబోయే ఆగస్టు 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ సవరణ ప్రకారం మారుతి సుజుకి కార్ల ధరలు మోడల్ మరియు వేరియంట్ ను బట్టి గరిష్టంగా రూ.30,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కంపెనీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also Read : టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన టీటీడీ..!
మారుతి సుజుకి సంస్థ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో ఈ ధరల పెంపునకు గల కారణాలను స్పష్టం చేసింది. కార్ల తయారీకి అవసరమయ్యే ముడిసరుకుల ధరలు నిరంతరం పెరిగిపోతుండటం మరియు ఇన్పుట్ ఖర్చులు అధికమవ్వడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అంతర్గతంగా ఖర్చులను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆపరేటింగ్ మార్జిన్లపై పడుతున్న అదనపు భారాన్ని భరించలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో అందులో కొంత భాగాన్ని వినియోగదారులపై వేయాల్సి వస్తోందని కంపెనీ వివరించింది.
Also Read : భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్..!
కంపెనీ ఇంకా మోడల్ వైజ్ పూర్తి ధరల పట్టికను విడుదల చేయనందున, మీరు ఎంచుకునే కారును బట్టి ఈ అదనపు భారం మారుతుంది. అయితే కొత్త ధరలు అమల్లోకి రాకముందే కార్లను బుక్ చేసుకునే వారికి డీలర్ నిబంధనలు మరియు డెలివరీ షెడ్యూల్ ఆధారంగా ప్రస్తుత పాత ధరల ప్రయోజనం లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా, బీవైడీ వంటి ఇతర కంపెనీలు కూడా ఇన్ పుట్ ఖర్చుల రీత్యా ధరలను సవరిస్తున్న తరుణంలో, మారుతి సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం అటు ఎంట్రీ-లెవల్ బడ్జెట్ కార్ల బయ్యర్లపై, ఇటు ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లపై ప్రభావం చూపనుంది.

