ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ.. వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సుమారు రూ. 8,175 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 300 ఎకరాల భూమిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : డయాబెటిస్ బాధితులకు వేసవిలో మజ్జిగ వరమేనా..?
రాంబిల్లిలో ఏర్పాటు కానున్న ఈ గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీనికి అదనంగా అనుబంధ పరిశ్రమల ద్వారా మరిన్ని వేల మందికి పరోక్ష అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ తయారయ్యే లిథియం అయాన్ సెల్స్ మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి మరియు సోలార్ ఎనర్జీ స్టోరేజీకి వెన్నెముకగా నిలవనున్నాయి.
Also Read : గెలుపు కోసం రంగంలోకి వైసీపీ కొత్త నేత..!
ఇదిలా ఉంచితే.. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతులు దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్ సంస్థలు సుమారు రూ. 70,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. దీనికి తోడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వరుసగా వస్తున్న ఈ భారీ పెట్టుబడులు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక కీలక పారిశ్రామిక కారిడార్ గా మార్చనున్నాయి.

