నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న దశాబ్దాల రాజకీయ వైరం అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ తలనీలాల వివాదంతో మరోసారి భగ్గుమంది. ఆలయ తలనీలాల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇరు వర్గాలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలతో స్థానికంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంగుల కుటుంబం చేస్తున్న విమర్శలపై స్థానిక శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అత్యంత ఘాటుగా స్పందించారు.
Also Read : నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన సూపర్ సక్సెస్..!
తనపై మరియు తన వర్గంపై వస్తున్న ఆరోపణలను చేతల్లో నిరూపించాలంటూ ప్రత్యర్థులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బహిరంగ సవాల్ విసిరారు. అహోబిలం పుణ్యక్షేత్రంలోనే ముఖాముఖి చర్చకు రావాలని, గంగుల కుటుంబం తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిజమని రుజువు చేస్తే.. క్షణమైనా ఆలస్యం చేయకుండా తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Also Read : ఆ విషయంలో కమల నేతలు ఎక్కడా..?
ఈ సవాల్ నేపథ్యంలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఇప్పటికే తన ప్రధాన అనుచరులతో కలిసి అహోబిలం చేరుకోవడంతో నియోజకవర్గంలో తీవ్ర హైటెన్షన్ నెలకొంది. మరోవైపు గంగుల వర్గం కూడా రంగంలోకి దిగే అవకాశం ఉండటంతో అహోబిలం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

