ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అది విపక్ష నేతలపై కాదు.. సొంత పార్టీ నేతపైనే. అది కూడా తన మంత్రివర్గ సహచరుడిపైనే. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీ బృందం పాల్గొంది. ఈ బృందానికి సీఎం చంద్రబాబు స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని భరోసా ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఏపీలో అరాచక పాలన జరిగిందని.. అందుకే పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని… ఏపీలో పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉన్నాయన్నారు చంద్రబాబు.
Also Read : ఏపిలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు
అయితే ఇదే వేదికపై మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెడితే ఏమవుతుందనే భయం చాలామందిలో ఉందన్నారు కూడా. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత విద్యావంతుడని… పార్టీ కార్యకర్తల సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధిపై కూడా స్పష్టమైన విజన్ ఉన్న లీడర్ అన్నారు. పార్టీ భవిష్యత్ లోకేష్ అని.. కాబోయే ముఖ్యమంత్రి అంటూ పారిశ్రామిక వేత్తలతో జరిగిన భేటీలో భరత్ వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు.
Also Read : 70 వేల సభ్యత్వాలు.. ఏపీలో మంత్రి రికార్డు..!
అసలు వచ్చిన పనేంటి… చేస్తున్న వ్యాఖ్యలేంటి చంద్రబాబు తప్పుబట్టారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు వచ్చి.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు చంద్రబాబు. ఇలా మరోసారి వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. వాస్తవానికి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఇటీవల పార్టీలో బలంగా వినిపిస్తోంది. మైదుకూరు సభలో చంద్రబాబు ఎదురుగానే రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈ ప్రతిపాదన చేయగా… సోమిరెడ్డి, వర్మ, ఆదిరెడ్డి వాసులు కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ను చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇది అటు టీడీపీ – జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది కూడా. ఇప్పటికే మా వల్లే అధికారంలోకి వచ్చారంటే… కాదు మా వల్లే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన మరో వివాదానికి తెర లేపింది. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్ఠానం.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది కూటమిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని… ఈ లోపు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దంటూ నేతలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లైంది.

