సాధారణంగా ఐఫోన్ ల విషయంలో కొందరు యువత దారుణాలకు పాల్పడుతూ ఉంటారనే వార్తలు మనం చూస్తూనే ఉంటాం. కొందరు ఎలా అయినా ఐఫోన్ పొందాలనే కోరికతో కిడ్నీలు, ఇంట్లో బంగారం వంటివి అమ్ముకున్నారనే వార్తలు కూడా మనం విన్నాం. ఇక మరికొందరు దొంగతనాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. కాని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాత్రం ఒకడు… ఐఫోన్ కోసం డెలివరి బాయ్ ని దారుణంగా చంపి కాలవలో పడేసాడు. చిన్హాట్ కు చెందిన గజానన్ ఫ్లిప్ కార్ట్ నుండి రూ లక్షన్నర విలువైన ఐఫోన్ ను ఆర్డర్ చేసి, COD (క్యాష్ ఆన్ డెలివరీ) ఆప్షన్ ను ఎంచుకున్నాడు.
దీనితో 30 ఏళ్ల డెలివరీ బాయ్ సాహు… ఫోన్ డెలివరి కోసం బుక్ చేసిన అడ్రస్ కు వెళ్ళాడు. ఆ ఫోన్ తీసుకునే ముందు డెలివరి బాయ్ డబ్బులు అడగగా… ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి, మరొకరితో కలిసి డెలివరి బాయ్ ని అత్యంత దారుణంగా చంపి… సమీపంలోని ఇందిరా కాలవలో పడేసారు. సాహు రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 25న చిన్హట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసారు. అక్కడి నుంచి పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also : టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరు…??
మృతదేహం కోసం ఎస్డిఆర్ఎఫ్ ను రంగంలోకి దించినట్టు పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 23న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సాహు కాల్ వివరాలను పరిశీలించిన అధికారులు… అతని లొకేషన్ కోసం ప్రయత్నం చేయగా… లాస్ట్ కాల్ గజానన్ కు చేసినట్టు గుర్తించారు. ఆ తర్వాతి అతని స్నేహితుడు ఆకాష్ ను విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. యువతలో ఈ విపరీత ధోరణితో అధికారులు ఆశ్చర్యపోతున్నారు.