ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యవహారాల మీద ఫోకస్ పెట్టిన పోలీసులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాల మీద దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జరిగిన దాడులపై ఇప్పుడు చర్యలకు రంగం సిద్దం చేస్తున్నారు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన కోసం రెండు రోజుల నుంచి గాలిస్తున్న ఏపీ పోలీసులు గన్నవరం లో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన అనుచరులు గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి ఆస్తులు ద్వంశం చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఏ 1 గా ఉన్న వల్లభనేని వంశీని టార్గెట్ చేసి అరెస్ట్ చేసారు పోలీసులు. గత వారం రోజుల నుంచి వంశీ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు వంశీ ని గన్నవరం లోనే అరెస్ట్ చేసారు పోలీసులు.
Also Read : చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది.. మందకృష్ణ భావోద్వేగం
ఆయన ప్రధాన అనుచరులు కొందరు రాష్ట్రం ధాటి వెళ్లిపోయారని సమాచారం. వంశీ అరెస్ట్ వ్యవహారంతో పార్టీ నేతల్లో కలవరం మొదలయింది. కీలక నేతలను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక వంశీ అమెరికా పారిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. అనూహ్యంగా వంశీ గన్నవరంలోనే ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్నట్టు గుర్తించిన ఏపీ పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరహాలో 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయవద్దని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.
పులివర్తి నానీ పై హత్యాయత్నం చేస్తే 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన సంగతి తెలిసిందే. కాగా వంశీ… మంత్రి లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిగత జీవితం పై కూడా కామెంట్స్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరుడ్ని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను అరెస్ట్ చేసారు. – మరో అనుచరుడు రమేష్ను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు… వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. హైదరాబాద్, గన్నవరంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

