ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థలను సమూలంగా ఆధునీకరించేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ అర్బన్ చాలెంజ్ ఫండ్–II కింద రాష్ట్రంలో రూ.5,912 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 14 భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆర్థిక శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : వంద శాతం స్ట్రైక్ రేట్.. ఇదే టార్గెట్..!
రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన రీజియన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను పటిష్ఠం చేయనున్నారు. ఇందులో భాగంగా అమరావతి రీజియన్లో 25, తిరుపతి రీజియన్లో 23, విశాఖపట్నం రీజియన్ పరిధిలో 11 మున్సిపాలిటీలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి వంటి కీలక నగర కార్పొరేషన్లతో పాటు తాడిగడప మున్సిపాలిటీలో తాగునీరు, వరద నీరు, మురుగునీటి డ్రైనేజీల ఆధునీకరణకు ఈ నిధులను భారీగా ఖర్చు చేయనున్నారు.
Also Read : నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?
పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు అధునాతన మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా అందించనుండగా, మిగిలిన 75 శాతం నిధులను మున్సిపల్ సొంత నిధులు, బాండ్లు మరియు బ్యాంక్ రుణాల ద్వారా సమీకరించుకునేందుకు ఆర్థిక శాఖ రాష్ట్ర స్థానిక సంస్థలకు అనుమతినిచ్చింది. ఈ భారీ ప్రాజెక్టులతో ఏపీలోని పట్టణాలు సరికొత్త రూపురేఖలను సంతరించుకోనున్నాయి.

