విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండటంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరంలో మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండటంతో ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు బొండా సిద్ధార్థను మేయర్ అభ్యర్థిత్వ రేసులోకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read : వెలిగొండ… కరవు ప్రాంతానికి ఊరట..!
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే బొండా ఉమ తన కుమారుడు సిద్ధార్థతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా విజయవాడ మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి బొండా సిద్ధార్థ బయోడేటాను సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు బొండా ఉమ. విద్యావంతుడైన సిద్ధార్థకు ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పం ఉందని, బెజవాడ నగర పాలనలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే ఈ భేటీ అనంతరం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది. బొండా సిద్ధార్థ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా స్పందించడమే కాకుండా, పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త టీడీపీ శ్రేణుల్లో హల్చల్ చేస్తోంది. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ, అంకితభావంతో పనిచేస్తున్న కుటుంబాలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. నగరంలో పార్టీ బలోపేతానికి, ప్రజల్లో కూటమి పట్ల ఆదరణ పెంచేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని అధినేత సూచించడంతో బొండా క్యాంప్ ఫుల్ జోష్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : పాపం ఐపీఎస్లు.. తస్మాత్ జాగ్రత్త..?
ఇప్పటికే విజయవాడ మేయర్ సీటు కోసం పార్టీలో పలువురు సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉండగా, ఎమ్మెల్యే బొండా ఉమ నేరుగా అధినేత చంద్రబాబు వద్ద తన కుమారుడి పేరును ప్రతిపాదించడం, దానికి బాబు సుముఖత వ్యక్తం చేశారనే ప్రచారం జరగడంతో బెజవాడ మున్సిపల్ ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. రేపటి తరం యువ నాయకత్వానికి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచనలో అధిష్ఠానం కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు బొండా సిద్ధార్థ్ రేసులో ముందంజలో నిలవడానికి ప్లస్ పాయింట్ కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

