తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు దిల్లీ వేదికగా ఏఐసీసీ అధిష్ఠానం నుండి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో, ఆమె తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా సూచించినట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో, ఆమెను మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయడానికి కూడా హైకమాండ్ వెనకాడబోదనే సంకేతాలు అందుతున్నాయి.
Also Read : రాపిడో, ఓలా, ఉబర్ల బాదుడుకు తెలంగాణా ఆర్టీసీ బ్రేక్..!
ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు దిల్లీ వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. బుధవారం నాడు మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా పునరాలోచించాలని ఆమె అధిష్ఠానాన్ని గట్టిగా కోరినప్పటికీ, పార్టీ పెద్దల నుండి ఆశించిన ఊరట లభించలేదని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పార్టీ నాయకత్వంపై వచ్చిన కొన్ని అంతర్గత వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తుండగా, ఈ వ్యవహారంపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read : భూమికి రెడ్ అలెర్ట్.. మరో రెండేళ్ళలో పరిస్థితి దారుణం..!
దిల్లీ వేదికగా జరిగిన ఈ హైడ్రామా అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నానని స్పష్టం చేశారు. అయితే, కేబినెట్లోని ఇతర సామాజిక వర్గాల నేతలపై కూడా ఆరోపణలు ఉన్నాయని, కేవలం బీసీ మహిళ అయిన తనపైనే ఇలాంటి చర్యలు ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె కాంగ్రెస్ పెద్దల వద్ద సామాజిక న్యాయం కార్డును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీసుకోబోయే అటో ఇటో తేల్చేసే ఈ తుది నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కుదుపుకు కారణమవుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

