ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు క్రికెట్ ప్రపంచంలో ట్రేడింగ్, రిటెన్షన్ల గురించిన ఊహాగానాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాలను పంచుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read : టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్..!
ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ ఫోటోలను షేర్ చేయడంతో ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి విశ్లేషణలు మొదలుపెట్టారు. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై జట్టు హార్దిక్ను తమతోనే ఉంచుకుంటోందని చెప్పడానికి ఇదొక పరోక్ష సంకేతమని కొందరు భావిస్తుంటే, గతంలో కూడా ఇలాగే ఆటగాళ్ల ఫోటోలు పెట్టి ఆ తర్వాత వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేసిన దాఖలాలు ఉన్నాయని, హార్దిక్ ముంబైని వీడటం ఖాయమని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
హార్దిక్ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్ ద్వారానే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లి, అక్కడ కెప్టెన్గా తొలి సీజన్లోనే టైటిల్ అందించి సత్తా చాటాడు. అయితే, ముంబై ఇండియన్స్ భారీ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ను మళ్లీ తమ జట్టులోకి తెచ్చుకుని, రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ, హార్దిక్ సారథ్యంలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐపీఎల్ 2024 లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిస్తే, ఐపీఎల్ 2026 సీజన్ను తొమ్మిదో స్థానంతో ముగించింది.
Also Read : పరిశ్రమల్లో పచ్చని విప్లవం.. పవన్ ఆదేశాలతో 43 వేలకు పైగా మొక్కలు..!
ఐపీఎల్లో ప్లేయర్ల బదిలీలు మరియు రహస్య ఒప్పందాల గురించి జరుగుతున్న ప్రచారంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆటగాళ్లు ఒక ఫ్రాంచైజీ నుండి మరో ఫ్రాంచైజీకి మారేటప్పుడు జరిగే ఆర్థిక లావాదేవీల వివరాలు కేవలం సదరు జట్లకు, ఆటగాడికి మరియు బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని ఆయన అన్నారు. ఐపీఎల్ బ్రాండ్ విలువ, పారదర్శకతను కాపాడటానికి ప్లేయర్ ట్రేడింగ్ విలువలను బహిరంగంగా ప్రకటించాలని గవాస్కర్ నేరుగా డిమాండ్ చేశారు.

