తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై థియేటర్లలో పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సంక్షేమ నిధికి విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాసింది.
Also Read : రైతుల కల సాకారమవుతున్న వేళ..!
ప్రభుత్వం జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. టికెట్ ధరల పెంపు ద్వారా లభించే ఈ 20 శాతం అదనపు వాటాను థియేటర్ల నిర్వాహకుల నుంచి సదరు చిత్రాల నిర్మాతలే నేరుగా వసూలు చేయాల్సి ఉంటుంది. అలా థియేటర్ల నుండి వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు విరాళంగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విడుదల అయిన సినిమాలకు కూడా ఈ నిబంధనలను వర్తింపచేసింది సర్కార్.
Also Read : సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో గుబులు..!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఈ సినిమాలను నిర్మించిన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, 14 రీల్స్ ప్లస్, షైన్ స్క్రీన్స్ ఇండియా, మరియు వృద్ధి సినిమాస్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖలు పంపింది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చే సమయంలోనే ఈ 20 శాతం సంక్షేమ విరాళం నిబంధనను లీగల్గా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

