ప్రముఖ దక్షిణాది నటి, ఒకప్పటి బోల్డ్ స్టార్ షకీలా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలు కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొబైల్ ఫోన్లను మితిమీరి వాడటం వల్ల ఆమె మెడ నరాలపై తీవ్ర ప్రభావం పడిందని, దీనివల్ల ఆమెకు అత్యవసరంగా మెడ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఈ సర్జరీ కోసం ఏకంగా రూ. 3 లక్షల వరకు ఖర్చయిందని, ఫోన్ల వ్యసనం వల్ల ఎంతటి ప్రమాదం పొంచి ఉందో చెబుతూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
Also Read : దమ్ముంటే సభకు రా.. జగన్కు ఆలపాటి ఛాలెంజ్..!
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రికార్డ్ చేసిన ఈ వీడియోలో, తనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో షకీలా క్షుణ్ణంగా వివరించారు. “నేను ప్రతిరోజూ బెడ్పై ఒక పక్కకు పడుకుని.. కదలకుండా దాదాపు నాలుగు గంటల పాటు మొబైల్లో గేమ్లు ఆడేదాన్ని. మధ్యలో టీ, కాఫీ తాగడానికి మాత్రమే లేచేదాన్ని. ఆ తర్వాత మళ్లీ అదే పొజిషన్లో కూర్చుని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో గంటల తరబడి రీల్స్ చూసేదాన్ని. ఈ తప్పుడు పోస్చర్ మరియు ఫోన్ను అతిగా వాడటం వల్ల నా మెడలోని ప్రధాన నరాలు దెబ్బతిన్నాయి. చివరకు అది నన్ను ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అమరావతికి రాచబాట.. సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!
ఈ చేదు అనుభవం తర్వాత షకీలా అందరికీ ఒక హెచ్చరిక చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారి జీవితాలను పాడుచేయవద్దని విజ్ఞప్తి చేశారు. “ఫోన్లను కేవలం అత్యవసర అవసరాల కోసమే వాడండి. సోషల్ మీడియాలో అనవసరమైన వీడియోలను చూడటం మానేయండి. ఆఖరికి నా వీడియోలను కూడా చూడకండి. కేవలం ఉపయోగపడే విషయాలనే చూడండి. లేకపోతే నాలాగే రూ. 3 లక్షల డబ్బు పోవడంతో పాటు, భరించలేని నరకయాతనను అనుభవించాల్సి వస్తుంది” అంటూ ఆమె గట్టిగా హితవు పలికారు. స్మార్ట్ఫోన్ల వాడకంపై ఆమె ఇచ్చిన ఈ సందేశం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

