పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి తొలగింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం.. ఎన్వోసీ విషయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో కొంతకాలంగా వివాదాలు, న్యాయపోరాటాల నడుమ సాగుతున్న రామాలయ నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Also Read : ఏపీ రైతులను ఆశ పెడుతున్న వాయి గుండం..!
ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణ వ్యవహారం కొంతకాలంగా న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వ్యవహారం హైకోర్టుకు చేరింది. అయితే గత 80 ఏళ్లుగా ఆ ప్రాంతంలో రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, అధికారులు రికార్డులు పరిశీలించిన తర్వాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పేర్కొంటూ మే నెలలో హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు పరిణామాల అనంతరం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎన్వోసీ సమర్థిస్తూ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
తాజా పరిణామంతో రామాలయ నిర్మాణంపై నెలకొన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగినట్లు అయ్యింది. గతంలోనే ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గం ఆలయ పునర్నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసింది. మే నెలలో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. సుప్రీంకోర్టు పరిణామంపై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ఆకివీడు పెదపేట రామాలయంపై వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన వెల్లడించారు. తీర్పును స్వాగతిస్తూ సత్యం, ధర్మం గెలిచాయని పేర్కొన్నారు.
Also Read : హైడ్రా కమిషనర్ ను తొలగించండి: హైకోర్ట్ సంచలనం
కొంతకాలంగా వివాదాలు, న్యాయపరమైన పరిణామాలతో వార్తల్లో నిలిచిన ఆకివీడు రామాలయ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా పిటిషన్ కొట్టివేతతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైందన్న సమాచారంతో స్థానిక భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆలయ నిర్మాణ పనులు ఇక ఏ విధంగా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రామాలయం పడేసి ఆ ప్రాంగణంలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు.. అక్కడ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠకు యత్నించారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు రాళ్ల దాడి చేయడంతో.. ఈ విషయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాదం చివరికి హిందు, దళిత క్రిస్టియన్ వార్గా మార్చిన వైసీపీ నేతలు.. ఆ మంటలో చలి కాచుకునేందుకు కూడా యత్నించారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అయ్యింది.

