గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.. హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ కమిషనర్ ఎవి రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తున్నారంటూ ఆయనపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. సెక్రటరీ ర్యాంక్లో ఉన్న ఒక ఉన్నతాధికారి ఈ విధంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
Also Read : మోదీ మార్క్ సరికొత్త రాజకీయం..!
రంగనాథ్పై దాఖలైన దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులను హైకోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా పరిగణించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తిని అదే పదవిలో కొనసాగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. రంగనాథ్ గనుక హైడ్రా కమీషనర్గా కొనసాగితే రూల్ ఆఫ్ లా గాడి తప్పుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించడం మినహా ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read : ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్ ఆయనే..!
హైడ్రా లాంటి కీలకమైన విభాగానికి చట్టాన్ని గౌరవించే అధికారులు అవసరమని అభిప్రాయపడిన హైకోర్టు, రంగనాథ్ స్థానంలో ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులపై కఠినంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే లోతుకుంట భూముల వ్యవహారంలో రంగనాథ్ హైకోర్ట్ కు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

