భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో దేశీయ క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ పనితీరుపై ఆగస్టు నెలలో ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వైట్-బాల్ సిరీస్ లలో ఘోర పరాజయాలను చవిచూడటంతో బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు.
Also Read : రామాలయానికి తొలగిన అడ్డంకి..!
టి20 ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే భారత జట్టు ప్రదర్శన ఇంతలా పడిపోవడంపై క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత్ 0-2తో కోల్పోగా, ఇంగ్లాండ్ పర్యటనలోనూ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో నాలుగు టి20లను చేజార్చుకోవడమే కాకుండా గిల్ సారధ్యంలో వన్డే సిరీస్ ను 1-2తో నష్టపోయింది. ఈ ఘోర పరాజయాలు జట్టు మునుపటి ప్రమాణాలకు తగినట్లుగా లేవని బోర్డు బహిరంగంగానే అంగీకరించింది. అయితే, ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తుండటంతో జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉన్నప్పటికీ, గంభీర్ రెగ్యులర్ కోచింగ్ బృందం వైఫల్యాలపై బోర్డు గట్టి నిఘా పెట్టింది.
Also Read : ఎందుకమ్మా ఇలా చేశావు.. చలించిన చంద్రబాబు..!
ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ మరియు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ భవితవ్యంపై పెద్ద చర్చ జరగనుంది. డోస్కాట్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాలని యోచిస్తుండగా, యూకే పర్యటనలో భారత జట్టు ఫీల్డింగ్, క్యాచ్ లు వదిలేయడం వంటి వైఫల్యాల వల్ల ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పదవిపై కూడా సందిగ్ధత నెలకొంది. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కాంట్రాక్ట్ కూడా పరిశీలనకు రానుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కాంట్రాక్ట్ ఉన్నందున ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ, రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని కోచింగ్ స్టాఫ్ ను ప్రక్షాళన చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా కనపడుతోంది.

