దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వల్ల నష్టపోతున్న విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, దోషులకు కఠిన శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం తన ఎక్స్ ఖాతా ద్వారా దేశ యువతకు సందేశాన్ని ఇచ్చారు. మన దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Also Read : ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కంచె వార్..!
పేపర్ లీకేజీలకు పాల్పడి, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారికి అత్యంత వేగంగా, కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రధాని ఆదేశించారు. మన యువత భవిష్యత్తును దెబ్బతీయాలని చూసే ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
Also Read : ఆ జిల్లాలో వైసీపీ ఇక కష్టమే..!
సీజేపీ మరియు ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ వేదికగా భారీ ఎత్తున విద్యార్థి నిరసనలను చేపట్టాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో పార్లమెంట్ ఉభయ సభలు కూడా స్తంభించిపోయాయి. ఈ తరుణంలోనే, మంగళవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా పేపర్ లీకేజీలను ఒక ఘోర పాపంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. బుధవారం లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గత పదేళ్లలో దేశంలో దాదాపు 150కి పైగా పేపర్ లీకులు జరిగాయని, కానీ ఒక్క కేసులో కూడా సరైన శిక్ష పడలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు, వ్యవస్థపై విద్యార్థుల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.

