భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా కఠిన చర్యలు చేపట్టారు. గత ఏడాది కాలంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన మెరుపు దాడులలో పోలీసులు భారీగా డ్రగ్స్ నెట్వర్క్ ను బద్దలు కొట్టారు. ఈ కాలంలోనే పోలీసులు ఏకంగా 563 ఎన్డీపీఎస్ కేసులను నమోదు చేసి సంచలనం సృష్టించారు. వివిధ అంతర్జాతీయ, దేశీయ ముఠాల నుండి సుమారు రూ.22.17 కోట్ల విలువైన అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : మహింద్రా క్రేజీ ఎస్యూవీ రెడీ..? ఆగస్ట్ 15 కు వచ్చేస్తుందా..?
పోలీసులు సీజ్ చేసిన వాటిలో 2,513 కిలోల గంజాయితో పాటు 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్ ఉన్నాయి. వీటితో పాటే పబ్ లు, రేవ్ పార్టీలలో ఎక్కువగా వాడే ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ స్టాంపులు మరియు ఓపియం వంటి సింథటిక్ డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. నగరంలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. లగ్జరీ లైఫ్ స్టైల్ మరియు పబ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జూబ్లీహిల్స్ జోన్ డ్రగ్స్ కు ప్రధాన అడ్డాగా మారినట్లు పోలీసులు గుర్తించారు. సిటీ మొత్తంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా కేవలం ఈ ఒక్క జోన్ పరిధిలోనే 116 కేసులు నమోదు కావడం గమనార్హం.
Also Read : అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!
డ్రగ్స్ వాడే వారిని పట్టుకునేందుకు పోలీసులు ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ పేరుతో సరికొత్త తనిఖీలకు తెరలేపారు. అనుమానితులపై జూబ్లీహిల్స్ రోడ్లపైనే కాకుండా పబ్ లలోనూ నిఘా పెట్టి, ఇప్పటివరకు 1,550 మందికి ఆన్ ది స్పాట్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. సరదా కోసం మత్తుకు అలవాటు పడి డ్రగ్ టెస్టుల్లో దొరికిపోతే కెరీర్ పూర్తిగా నాశనమవుతుందని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కేసు నమోదైతే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రావని, విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్, వీసాలు కూడా దొరకవని యువతను అలర్ట్ చేశారు.

