కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకోబోతున్నాయనే ప్రచారం దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ, బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ కొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మరంగా రంగం సిద్ధం చేస్తున్నారు. వరుస భేటీలతో ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆయన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో నితిన్ నబీన్ నిన్న పలువురు కేంద్ర సహాయ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
Also Read : లోకేష్ సంచలన ప్రకటన.. దేశంలోనే తొలి రాష్ట్రం..!
అంతటితో ఆగకుండా ఇవాళ, రేపు కూడా పలువురు కీలక కేంద్ర మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కొత్తగా వచ్చే టీమ్ లో ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరిని తప్పించాలనే అంశంపైనే ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అనుసరించిన వ్యూహాత్మక ఫార్ములానే ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రివర్గంలో యువతకు, సరికొత్త ముఖాలకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. పాత తరం నేతలను పక్కన పెట్టి, దూకుడుగా ఉండే యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.
Also Read : నదుల అనుసంధానంతో భారత్ ‘అన్స్టాపబుల్’..!
ప్రతిపక్ష కూటమి నమ్ముకున్న ‘PDA’ అంటే పిచ్డె, దళిత, అల్పసంఖ్యాక – వెనుకబడిన, దళిత, మైనారిటీ.. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రాబోయే కొత్త టీమ్ లో ఓబీసీ, దళిత వర్గాలు, మహిళలు మరియు యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఈ భారీ ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కొంతమంది సీనియర్లకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వారిని కేబినెట్ నుంచి తప్పించి, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ సమాచారంతో ఇప్పుడు ఏ కేంద్ర మంత్రి పదవి ఊడుతుందో, ఎవరికి కొత్తగా ఛాన్స్ దక్కుతుందో తెలియక అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

