సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ సభ్యులు మరియు రాజకీయ నేతలపై అసభ్యకర పోస్టులు, ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్దం చేసింది. ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీవ్యాప్తంగా పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియా అకౌంట్లపై ఇంటెలిజెన్స్, ఐటీ కోర్ మరియు సైబర్ క్రైమ్ విభాగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. సమాజంలో అశాంతి రేపేలా, క్యారెక్టర్ అస్సాసినేషన్ కు పాల్పడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : ఏపి పోలీసుల పై మంత్రి భరత్ ఘాటు వ్యాఖ్యలు
ఈ ఉక్కుపాదంలో భాగంగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేవలం గత కొద్ది రోజుల్లోనే ఇక్కడ 20కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అసభ్యకర కంటెంట్ను క్రియేట్ చేసిన వారితో పాటు, వాటిని షేర్ చేసిన మరియు ఫార్వార్డ్ చేసిన వారి ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసి పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ఆధారాలతో నిందితుల కోసం వేట సాగించిన పోలీసులు.. సోషల్ మీడియాలో తీవ్రమైన అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురు కీచకులను ఇప్పటికే అరెస్ట్ చేశారు.
Also Read : దామచర్లపై బాలినేని మరోసారి సంచలన కామెంట్స్
అరెస్ట్ చేసిన నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు సోషల్ మీడియా వినియోగదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ (X), యూట్యూబ్ లలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటేనని, చట్టపరంగా కఠినమైన సెక్షన్ల కింద జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

