హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్, అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 25న న్యాయస్థానం ముందు విచారణకు రావాలంటూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం టాలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Also Read : తెలంగాణాలో జనసేన తొలి అడుగు..!
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రాకతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో సరైన ముందస్తు భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అభిమానులను నియంత్రించడంలో విఫలం కావడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
Also Read : బ్రేకింగ్: కొడాలి అరెస్ట్ కు రంగం సిద్దం..?
ఈ కేసులో భద్రతా లోపాలు, నిర్లక్ష్యపూరిత వైఖరిని ఆధారంగా చేసుకుని పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు సహా మరో 19 మంది నిందితులకు కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అందరూ నిర్ణీత గడువులోగా కోర్టుకు హాజరై తమ వివరణ ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో అల్లు అర్జున్ లీగల్ టీమ్ తదుపరి చర్యలపై అతనితో చర్చిస్తున్నట్లు సమాచారం.

