సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక భారీ భూ కుంభకోణం తాజాగా బట్టబయలైంది. గండిపేట పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు జరిగిన ఓ భారీ కుట్రను అధికారులు, పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత పాత్ర ఉన్నట్లు వెల్లడికావడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గండిపేట ప్రాంతంలో ఉన్న దాదాపు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కొందరు కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు.
Also Read : కొడుకు కోసం మాజీ సీఎం ఆరాటం..!
ఇందుకోసం వారు ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ జీఓలను సృష్టించడం గమనార్హం. అధికారులను బురిడీ కొట్టించి, రికార్డులను తారుమారు చేయడం ద్వారా ఈ భారీ ల్యాండ్ దందాకు తెరలేపినట్లు విచారణలో తేలింది. ఈ భూ దందాపై నిఘా పెట్టిన పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు ముఖ్య నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read : హైకోర్టులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!
మరోవైపు ఈ ముఠా వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అలాగే బొల్లా రమేష్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో పక్కా ఆధారాలు లభించాయి. వీరిద్దరి ప్రోద్బలంతోనే ఈ నకిలీ జీఓల వ్యవహారం, ప్రభుత్వ భూముల ఆక్రమణ యత్నం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు నమోదు కావడంతో బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా మరి కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

